వైఎస్ కు 'గ్లామర్' అంకితం

సినీరంగం అంటేనే రంగుల ప్రపంచం. పరిశ్రమ గురించి రంగుల కలలతో అక్కడకు వచ్చే వారికే ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'గ్లామర్'. ఈ చిత్రాన్ని స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అంకితమిస్తున్నట్టు చిత్ర దర్శకనిర్మాత సత్యారెడ్డి తెలిపారు. కరిష్మా కోఠర్ ('శంకర్ దాదా జిందాబాద్' ఫేమ్) ప్రధాన భూమిక పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది.

సత్యారెడ్డి మాట్లాడుతూ, నాగార్జున సాగర్, వైజాగ్, ముంబైలలో ఈ చిత్రం షూటింగ్ జరిపామనీ, నేటితో షూటింగ్ పార్ట్ పూర్తయిందనీ చెప్పారు. ఇందులో మంచి సందేశంతో పాటు చక్కటి కామెడీ కూడా ఉంటుందన్నారు. నవంబర్ మొదటి వారంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తామనీ, అదే నెల చివరి వారంలో సినిమా విడుదల చేస్తామనీ చెప్పారు. చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలందించిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్టు తెలిపారు. కరిష్మా కోటక్ మాట్లాడుతూ, 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం తర్వాత తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ కథలు నచ్చక ఒప్పుకోలేదనీ, సత్యారెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించాననీ చెప్పారు. సరైన అవగాహన లేకుండా సినీరంగంలోకి రావాలన్న తపనతో, గ్లామర్ పరిశ్రమ గురించి రంగురంగుల కలలు కని ఇక్కడకు వచ్చి మోసపోయే వారికి ఈ చిత్రం ఓ డిక్షనరీలా ఉపయోగపడుతుందన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, దీని తర్వాత తెలుగులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించే అవకాశాలు లభిస్తాయనే నమ్మకం ఉందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కరిష్మా కోటక్, ఫరాఖాన్, భువనేశ్వరి, తెలంగాణ శకుంతల, ధర్మవరపు, జీవా, కొండవలస, కళ్లు చిదంబరం, కవిత, గుండు హనుమంతరావు, జెన్నీ తదితరులు నటించారు. కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం పి.సత్యారెడ్డి అందించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, బొంబాయి రవి సంగీతం అందించారు.

No comments:

Post a Comment