గర్వించే చిత్రంగా 'ప్రస్థానం'

గమ్యం' చిత్రం తర్వాత తాను గర్వించే చిత్రంగా 'ప్రస్థానం' రూపొందుతోందని హీరో శర్వానంద్ తెలిపారు. ఈ చిత్రం హీరోగా తన స్థాయిని పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. శర్వానంద్, రూబి జంటగా దేవా కట్టా ('వెన్నెల' ఫేమ్) దర్శకత్వంలో 'ప్రస్థానం' తెరకెక్కుతోంది. వి.ఆర్.సి. మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రవి వల్లభనేని నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవల హైద్రాబాద్, విజయవాడలలో ప్రధాన తారాగణమంతా పాల్గొనగా మూడో షెడ్యూల్ లో భాగంగా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.

శర్వానంద్ మాట్లాడుతూ, చక్కటి కథా కథనాలతో మంచి టీమ్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువవుతుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇటీవల విజయవాడలో తీశామనీ, ఈనెల 29 నుంచి 10 రోజుల పాటు జరిగే చివరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. 'వెన్నెల' చిత్రం ద్వారా పార్వతీ మెల్టన్ ను హీరోయిన్ గా పరిచయం చేసినట్టే ఈ చిత్రం ద్వారా రూబిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామని అన్నారు. దర్శకుడు దేవ్ కట్టా మాట్లాడుతూ, ఈ చిత్రంలోని పాటలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. తనతో పాటు వనమాలి, చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారనీ, 'వెన్నెల' కంటే ఈ చిత్రం ఆడియో మరింత ఆకట్టుకుందనీ తెలిపారు. ఈ చిత్రలో సాయికుమర్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు తారాగణం. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం దేవ్ కట్టా అందిస్తున్న ఈ చిత్రానికి వల్లభనేని రోశయ్య సమర్పకుడు. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు

No comments:

Post a Comment