దేవీశ్రీ జంటగా హన్సిక

ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మనో, ఆర్.పి.పట్నాయక్ వంటి పలువురు సంగీత దర్శకులు నటులుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. మరికొందరు సంగీత దర్శకులు సింగర్లుగా వెండితెరపై కనిపించిన సందర్భాలూ ఉన్నాయి. యువ సంగీత తరంగం దేవీశ్రీప్రసాద్ సైతం ఇప్పుడు ఎకాఎకిన హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. నిజానికి కొద్దికాలంగా ఆయన హీరో అవుతున్నట్టు ప్రచారం జరిగినా ఆయన సంగీతానికే తన ప్రాధాన్యం అంటూ చెప్పుకొచ్చారు. అయితే హీరో అయ్యే రోజు ఇప్పుడు రానే వచ్చింది. ఆయన హీరోగా సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ఓ కొత్త చిత్రానికి ఇటీవలే నిరాడంబరంగా సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు కూడా జరిపారు. తులసీరామ్ ('మంత్ర' ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా దేవీశ్రీ సరసన అందాల నటి హన్సికా మోత్వాని ఎంపికైనట్టు సమాచారం.

తొలుత హీరోయిన్ గా ఛార్మి పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ ప్లేస్ లో హన్సిక వచ్చి చేరిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. దీనితో పాటు మరో రెండు చిత్రాలకు కూడా ఎం.ఎస్.రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది 'అరుంధతి' వంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన కోడిరామకృష్ణ దర్శకత్వంలో 'చండి' అనే భారీ చిత్రానికి ఎమ్మెస్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. చండిగా నటించబోయే హీరోయిన్లలో అనుష్క, నయతారతో పాటు హన్సిక పేరు కూడా వినిపిస్తోంది. వీటికి తోడు బాలీవుడ్ లో విజయవంతమైన ఓ చిత్రాన్ని రీమేక్ చేయడం ద్వారా తన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో కూడా ఎమ్మెస్ రాజు ఉన్నారు.

No comments:

Post a Comment