మళ్లీ రాజస్థాన్ కు 'కిలాడీ'

ప్రిన్స్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. 'అతిథి' చిత్రం తర్వాత మళ్లీ ఆయన ముఖానికి మేకప్ వేసుకోలేదు. 'పోకిరి' చిత్రం తెలుగు సినీ రికార్డులను అప్పట్లో తిరగరాసిన నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రాన్ని ఆ చిత్రంతో ప్రేక్షకులు పోల్చి చూడటం వల్ల సంతృప్తికరమైన ఫలితం రాలేదు. దీంతో కొద్ది గ్యాప్ తీసుకుని పూర్తి శక్తియుక్తులతో కొత్త గెటప్, ప్రెజెంటేషన్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని మహేష్ భావిస్తూ వచ్చారు. అందులో భాగంగానే పెను తుఫాను తలొంచి చూసే నిప్పుకణంలా 'అతడు' చిత్రంలో మహేష్ ను చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి మహేష్ తో చేయి కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న 'కిలాడీ' (వర్కింగ్ టైటిల్) చిత్రం శరవేగంగా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. భారీ బడ్జెట్ తో సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ లో ఓ కీలక షెడ్యూల్ జరిపిన చిత్ర యూనిట్ మరో సారి రాజస్థాన్ కు పయనం కానుంది.

సింగనమల రమేష్ మాట్లాడుతూ, మహేష్ బాబు ఇందులో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారనీ,సకుటుంబ సమేతకంగా చూసే చిత్రంగా దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారనీ చెప్పారు. ప్రేక్షకాభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈనెల 19 నుంచి హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుతున్నామనీ, నవంబర్ మొదటి వారంలో నెలరోజుల పాటు రాజస్థాన్ లో షూటింగ్ ఉంటుందనీ చెప్పారు. అక్కడ్నించి వచ్చిన వెంటనే వికారాబాద్ లో వేస్తున్న భారీ విలేజ్ సెటల్ లో చేసే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. సంక్రాంతి రిలీజ్ కు ప్లానింగ్ ఉందన్నారు. మహేష్ కు జోడిగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, డాక్టర్ బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు, సునీల్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, షఫీ, సునీల్ శర్మ తదితరులు నటిస్తున్నారు. సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment