హన్సికతో పూరీ కటీఫ్!

సిమ్లా యాపిల్ ను తలపించే హన్సికకు 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర పడటంతో వరుసగా మంచి ఆఫర్లు ఆమె చేతిలోకి వచ్చాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్, ప్రభాస్, కల్యాణ్ రామ్ వంటి యంగ్ హీరోల సరసన నటించిన హన్సిక ఇప్పుడు నితిన్ 'సీతారాముల కల్యాణం..లంకలో' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ తన గురువు పూరీ జగన్నాథ్ 'గోలీమార్' చిత్రంలో నటించే అవకాశం హన్సికకు వచ్చినట్టు నిన్నటి వరకూ బలంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆమె చేజారిపోయినట్టేనని తెలుస్తోంది.'దేశముదురు' చిత్రంతో హన్సికను పూరీ జగన్నాథ్ తెలుగు తెరకు పరిచయం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకునే గోపీచంద్ హీరోగా పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించతలపెట్టిన 'గోలీమార్' చిత్రానికి మరోసారి హన్సికను పూరీ సంప్రదించారు. ఇందుకు సరేనన్న హన్సిక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం 80 లక్షలకు తగ్గేదిలేదని భీష్మించిందట. ఈమధ్యనే వచ్చిన 'మస్కా', 'జయీభవ' చిత్రాల ఫలితం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ 'రేటు' విషయంలో ఆమె పట్టుబట్టడం పూరీకి నచ్చలేదట. అయితే పూరీ సైతం ఇటీవల సరైన సక్సెస్ కొట్టలేకపోవడం కూడా హన్సికను ఆలోచింపజేసి ఉండొచ్చు. ఏదిఏమైనా హన్సిక ను పూరీ వదులుకోకపోవచ్చనీ, ఆమె వైపే గోపీచంద్ మొగ్గుచూపుతున్నారనీ అంటున్నారు. మరి హన్సికకు పూరీ ఎగ్జిట్ గేట్ చూపిస్తారో, కాస్త అటూ ఇటూగా ఆమె అడిగిన పారితోషికం ముట్టజెపుతారో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment