కొత్తవారితో 'కృష్ణాముకుందా'

బాలు, రేణురాయ్, ధితి హీరోహీరోయిన్లుగా పల్లేమల్లి హరికృష్ణారెడ్డి నిర్మాతగా తేజశ్విని ఫిలింస్ పతాకంపై పొడక్షన్ నెంబర్ 2 చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకొంది. జి.రవి దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా హైద్రాబాద్ లోని సత్యారెడ్డి గెస్ట్ హౌస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.చిత్ర విశేషాలను నిర్మాత హరికృష్ణారెడ్డి తెలియజే్సతూ, గతంలో 'చిలకా గోరింకా' చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించినట్టు చెప్పారు. ఇప్పుడు తాను నిర్మాతగా వ్యవహరిస్తూ తన మిత్రుడైన జి.రవికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. రవి గతంలో పలు టీవీ సీరియల్స్ కు దర్శకుడుగా, కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారని అన్నారు. అతను చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలోనే సినిమా నిర్మాణం జరుపుతున్నట్టు చెప్పారు. ఇది ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుందనీ, లవ్, కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బాల నటీనటులు చేసే కామెడీ హైలైట్ గా ఉంటుందన్నారు. శ్రీవాసు సంగీత దర్శకత్వంలో శ్రీరాగ్ రాసిన ఐదు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. జనవరి 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుపుతామని చెప్పారు. అనంతపురం, వైజాగ్, అరకులో కూడా షూటింగ్ ఉంటుందనీ, మార్చి వరకూ నాలుగు షెడ్యూల్స్ తో సినిమా పూర్తవుతుందన్నారు. అలాగే బాంబే అమ్మాయి చేసే ఓ ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనీ, 'కృష్ణాముకుందా' అనే టైటిల్ పరిశీలనలో ఉందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఎమ్మెస్ నారాయణ, జీవా, కొండవలస, రామ్ జగన్, చిన్నా, ధర్మవరపు కవిత, మాస్టర్ ప్రణీత్ కుమార్, సాత్రి, తబబ్లూ తదితరులు నటిస్తున్నారు. బల్లెం వెంకట్ మాటలు, మల్లిక్ విన్నకోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

No comments:

Post a Comment